తాను మరణించానంటూ రాసిన వెబ్‌సైట్‌పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటు స్పందన

  • అనురాగ్ ఇక లేరంటూ రాసిన కమల్ ఆర్ ఖాన్ వెబ్‌సైట్
  • యముడే తనను ఇంటి వద్ద వదిలి వెళ్లాడన్న కశ్యప్
  • తాను సినిమాలు తీయకపోతే మూర్ఖులకు పని ఉండదంటూ సెటైర్
కమల్ ఆర్ ఖాన్.. బాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. సినీ విమర్శకుడు అయిన ఆయన నటుడు కూడా. సెలబ్రిటీలపై వివాదాస్పద ఆరోపణలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. అతడి ఆధ్వర్యంలోని ఓ వెబ్‌సైట్ తాజాగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరణించినట్టు రాసుకొచ్చింది.

ఈ వార్త చూసిన అనురాగ్ ఘాటుగా స్పందించారు. తాను నిన్న యమ ధర్మరాజును చూశానని, నేడు ఆయనే స్వయంగా తనను ఇంటి వద్ద దింపేసి వెళ్లారని పేర్కొన్నారు. ఇకపై మరిన్ని ఎక్కువ సినిమాలు తీయాలని యముడు తనతో చెప్పి వెళ్లాడని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

తాను సినిమాలు తీయకపోతే మూర్ఖులు, భక్తులు దానిని బహిష్కరించలేరని, అప్పుడు వారి జీవితాలకు ఓ అర్థమంటూ లేకుండా పోతుందని, కాబట్టి వారి పుట్టుకకు ఓ అర్థం ఉండాలనే ఉద్దేశంతోనే యముడు తనను ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడని అనురాగ్ పేర్కొన్నారు.

తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉండే కమల్ ఆర్ ఖాన్.. ఇకపై రివ్యూలు ఇవ్వద్దంటూ కరణ్ జొహార్, అనురాగ్ కశ్యప్‌లు 2015లో తనను కోరారని కమల్ ఆరోపించారు. అంతేకాదు, 'బాంబే వెల్వెట్' సినిమాకు చక్కని రివ్యూ ఇవ్వాలంటూ కరణ్ జొహార్ తనకు రూ. 25 లక్షలు ఆఫర్ చేశారని, అయితే, ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని 2015లో కమల్ చేసిన ట్వీట్లు అప్పట్లో సంచలనమయ్యాయి. అయితే, కమల్ వ్యాఖ్యల్లో నిజం లేదని అనురాగ్ అప్పుడే ఖండించాడు.

Anurag kashyap
Bollywood
KRK
Yama Dharma Raj

More Telugu News